ఫోన్ ట్యాపింగ్ కేసు... నేడు సిట్ విచారణకు హాజరుకానున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

  • వేగవంతమైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు
  • విచారణకు హాజరుకావాలంటూ ఆర్కే, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు
  • ఇప్పటికే 228 మంది వాంగ్మూలాలు నమోదు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు (ఆర్కే), చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి సిట్ నోటీసులు అందించింది.

వివరాల్లోకి వెళితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేసేందుకు విచారణకు హాజరుకావాలని వేమూరి రాధాకృష్ణకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) వద్ద లభ్యమైన కాల్ డిటైల్ రికార్డ్స్‌లో (సీడీఆర్) రాధాకృష్ణ ఫోన్ నంబర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, కేసు దర్యాప్తులో ఆయన వాంగ్మూలం అవసరమని భావించి నోటీసులు పంపినట్లు తెలిపారు. దీంతో ఆయన శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరుకానున్నారు.

మరోవైపు, బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి కూడా సిట్ నుంచి పిలుపు అందింది. ఆయన ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించడంతో విచారణకు రావాలని అధికారులు కోరారు. 2023 నవంబర్ నెలలో అప్పటి ఎస్ఐబీ అధికారి ప్రణీత్ రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

ఈ కేసులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. వీరిలో ఇప్పటికే 228 మందికి నోటీసులు జారీ చేసి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.

Radhakrishna
Phone tapping case
Telangana
SIT investigation
ABN Andhra Jyothi
Konda Vishweshwar Reddy
Praneeth Rao
Call detail records

More Telugu News